Tuesday, February 24, 2009

మారిన నిర్ణయం

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఇలా అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవడంవల్ల మేలు కలగవచ్చు. నాగరాజు లాంటి పట్టుదలగల యువకుడు, ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు.  

నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం వున్నది. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు. అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే, ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్ళి చేసుకోవడం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత వూరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో "పనిలో పనిగా రత్నాన్ని పెళ్ళి చేసుకొని వెంటబెట్టుకుపో" అన్నారు.

నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు.
ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారు వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంతదూరం పరిగెత్తి, ఒకపెంకుటింటి అరుగుమీద తలదాచుకున్నాడు. అయితే ఆ సరికే అతను బాగా తడిసిపోయాడు. "అయ్యో, బాగా తడిసిపోయావు. లోపలికిరా, బాబూ" అంటూ కిటికీలోంచి అతణ్ణి చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది.

నాగరాజు మొహమాటపడుతూనే లోపలికి వెళ్ళాడు. "సంధ్యా, పొడిగుడ్డ తీసుకు రామ్మా. ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు" అని ముసలావిడ లోపలికి కేక పెట్టింది.

"అందమైన పేరు!" అనుకున్నాడు నాగరాజు.

ఇంతలో కాళ్ళ గజ్జెల గలగల శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మందాకా వెళ్ళి, బట్ట అందుకున్నది.

నాగరాజు తడిసిన తల తుడుచుకుంటుండగా "కాసిని వేడిపాలు పట్టుకురా సంధ్యా" అని మళ్ళీ కేకపెట్టింది ముసలావిడ.

తరవాత ఆమె నాగరాజును గురించి తెలుసుకున్నది; తమను గురించి చెప్పింది; వాళ్ళు ఆ వూరుకు కొత్తగా వచ్చారు.

కౌలుకు యిచ్చిన పొలం సొంతంగా చేసుకుంటున్నారు. ఆమెకు సంధ్య ఒక్కతే కూతురు, ముసలావిడ భర్త చాలా కాలం కిందటే పోయాడు.

సంధ్యను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉన్నది. కాని, పాలు కూడా గుమ్మందాకా వెళ్ళి ముసలావిడే అందుకోవడంతో, అతడికి ఆ అవకాశం చిక్కలేదు.
మర్నాడు పని గట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్ళాడు నాగరాజు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది. ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి, "మా సంధ్య తోచనప్పుడు యిలా తెరలూ అవీ అల్లుతూ వుంటుంది" అన్నది.

ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమయిన ఫలహారం అందింది కాని, ఆమె దర్శనం మాత్రం కాలేదు.

ఆ మర్నాడు తమ దొడ్లో కాసిన రెండు దానిమ్మపళ్ళు తీసుకొని, నాగరాజు, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉన్నది. లోపలినుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది. నాగరాజు తీయని ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడినుంచి వచ్చిన ముసలావిడను అతడు గమనించలేదు.

ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ "ఇప్పుడే వచ్చావా బాబూ? మా సంధ్య పాట మొదలుపెడితే, పరిసరాలు మరచిపోతుంది" అన్నది.
లోపలి గదిలో వున్న సంధ్య, నాగరాజుకు కనపడలేదు. అతడు దానిమ్మపళ్ళను ముసలావిడ చేతిలో పెట్టి, కాసేపు కబుర్లు చెప్పి, ఇంటికి వచ్చేశాడు. అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది. ఆమె పెద్దగా అందంగా లేకపోయినా,ఆమెనే పెళ్ళాడాలన్న దృఢనిశ్చయానికి వచ్చాడు. మర్నాడు ఎలాగయినా సంధ్యను చూడాలనీ, ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలనీ నిశ్చయించుకున్నాడు.

నాగరాజు ఆ మరుసటిరోజున సంధ్యవాళ్ళ ఇంటిని సమీపిస్తుండగా, హఠాత్తుగా పక్క సందులోంచి వచ్చిన ఎద్దొకటి, అతణ్ణి పొడిచి పారిపోయింది.

నాగరాజు కిందపడిపోయాడు. అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది. ఈ అలికిడికి ముసలావిడ ఇంట్లొంచి బయిటికి

వచ్చింది. ఆమె నాగరాజును చూసి "అయ్యో ఏం జరిగింది? చేతినుంచి రక్తం కారుతున్నది, లోపలికి రా" అని ఆందోళనపడుతూ వచ్చి, గాయపడిన నాగరాజు చేయి పట్టుకున్నది.

"మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పక్క సందులోనుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు" అన్నాడు నాగరాజు.

ముసలావిడ నాగరాజును ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి, "సంధ్యా, చెంబుతో నీళ్ళు పట్టుకురా" అని గట్టిగా కేకపెట్టింది.

నడవాగది కిటికీవద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉన్నది. ఆమె ముఖకవళికల్లో జాలి, ఆదుర్దాలాంటి లక్షణాలే లేవు. తీరా తల్లి కేక వేసాక ఆమె కిటికీ దగ్గరనుంచి కదలి, కొంచెం సేపట్లో నీళ్ళ చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటుకు వచ్చింది.

ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్ళతో, నాగరాజు గాయం కడిగింది. ఆ తరవాత పసుపూ, శుభ్రమైన గుడ్డా తెమ్మని చెప్పింది.

సంధ్య పసుపూ, గుడ్డా తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, "ఇప్పుడు చెప్పు బాబూ! నువు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి?" అని అడిగింది.

వెంటనే నాగరాజు " మా మేనమామ కూతురితో నా పెళ్ళి జరగబోతున్నది. మీరూ, సంధ్య తప్పకుండా రావాలి" అని చెప్పి ఇంటికి వచ్చేశాడు.

బేతాళుడు యీ కథ చెప్పి "రాజా నాకొక సందేహం! నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా. ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆఖరిక్షణంలొ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగులుతుంది" అన్నాడు.

దానికి విక్రమార్కుడు "నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరి అయినదే. ప్రతిమనిషికీ కనీసమైన కొన్ని మంచి లక్షణాలుండాలి. అవి లోపించినపుడు, ఇతర అర్హతలు ఎన్ని వున్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికుండవలసిన కనీస లక్షణాలు. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, సేవాధర్మం వంటి లక్షణాలు తప్పకుండా వుండాలి. ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదు. సంధ్య నాగరాజు గాయాన్నీ, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏ మాత్రం చలించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు. ఆమెది రాతి గుండె అని  యీ విషయం రుజువు చేస్తున్నది. అందుకే అన్ని అర్హతలున్న అందాలరాశిని కాక, కనీసార్హతలయిన ప్రేమ, అభిమానం ఉన్న మేనమామ కూతురిని పెళ్ళాడడానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు" అన్నాడు

రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

Thursday, February 19, 2009

విష ప్రయోగం

Image Hosted by ImageShack.usపట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "రాజా, నీవంటి వారిపై సాధారణంగా కుట్రలు జరుగుతూంటాయి. దాని ఫలితంగానే నువ్వీ అపరాత్రివేళ ఇన్ని పాట్లకు గురి అవుతూ ఉండవచ్చు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉజ్జయనీ రాజుపై జరిగిన కుట్ర గురించి చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగాడు:

ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో వజ్రగుప్తుడనే వజ్రాల వర్తకుడుండేవాడు. అతను అపూర్వమైన వజ్రాలను మాత్రమే కొనేవాడు, అమ్మేవాడు. అతని వజ్రాలను రాజులూ, మహరాజులూ మాత్రమే కొనేవారు. అపూర్వమైన వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు వార్త వచ్చినా వజ్రగుప్తుడు సముద్రాలు సైతం దాటి వెళ్ళి, వాటిని ఖరీదు చేసేవాడు.

ఒకసారి అతను క్రౌంచద్వీపంలో "శిరీషకం" అనే గొప్ప వజ్రాన్ని కొన్నాడు. దాన్ని యాభై లక్షల వరహాలకు అమ్మాలని అతను నిశ్చయించుకొని స్వదేశానికి తిరిగివచ్చాడు.

వజ్రగుప్తుడి వద్ద శిరీషకం ఉన్న వార్త తెలిసి ఉజ్జయినీ రాజు అతన్ని పిలిపించి వజ్రాన్ని పరీక్షించాడు. రాజుకు అది అపూర్వమైన వజ్రం అన్న నమ్మకం కలగగానే దాన్ని కొనాలని బుద్ధిపుట్టింది.

"వజ్రగుప్తా, ఈ మణిని కొనదలిచాం. పాతికలక్షల వరహాలకు మాకు అమ్మెయ్యి" అన్నాడు రాజు.

వజ్రగుప్తుడి గుండెలో రాయిపడింది. తానా వజ్రానికి నిశ్చయించిన ధరలో సగమే రాజు ఇస్తానంటున్నాడు. రాజు ఒక ధర చెప్పినాక అంతకు మించి అడగడం అమర్యాద అవుతుంది. ఇవ్వనంటే రాజుకు కోపం వస్తుంది. అందుచేత వజ్రగుప్తుడు ఏమీ అనలేకపోయాడు.

అది చూసి రాజు "మేము చెప్పిన ధర నీకు నచ్చలేదు లాగుంది?" అన్నాడు.

"అదేమీ లేదు మహరాజా. ఇది గ్రహ ప్రభావం గల వజ్రం. కొన్ని జన్మనక్షత్రాలు గలవారికే ఇది ఉపకరిస్తుంది. మరి కొందరికి నష్టమూ, కొన్ని జన్మనక్షత్రాలవారికి ప్రాణాపాయమూ కూడా కలిగించగల వజ్రం ఇది. అందుకే సందేహిస్తున్నాను" అన్నాడు వజ్రగుప్తుడు.

Image Hosted by ImageShack.usఅతను అబద్దం చెబుతున్నాడని రాజు గ్రహించి, తన జన్మనక్షత్రం చెప్పి "నాకిది ఎలాటి ఫలితాన్ని కలిగిస్తుందంటావు?" అన్నాడు.

వజ్రగుప్తుడు చప్పున "మహారాజా, తమకిది ప్రాణహాని కలిగించవచ్చు. దీన్ని మీరు కొనటం మంచిది కాదు" అన్నాడు. అదే జన్మనక్షత్రం గల మరొక వర్తకుడు ఆ వజ్రాన్ని కొన నిరాకరించినట్టు కూడా అతను రాజుతో అన్నాడు.

రాజు నవ్వి " నాకా భయాలు లేవు. అన్నిటికీ తెగించి నేనీ వజ్రాన్ని కొనదలిచాను. అందుచేత నువు నిశ్చింతగా దీన్ని మాకు అమ్మవచ్చు" అన్నాడు.

వజ్రగుప్తుడు శిరీషకాన్ని రాజుకు అమ్మక తప్పలేదు.

ఈ సంగతి రాజకుమారుడైన ప్రసేనుడికి తెలియ వచ్చింది. ప్రసేనుడు యువరాజు. అతను సూక్ష్మబుద్ధి గలవాడే గాని దుర్మార్గుడు. అతను వజ్రగుప్తుడి వద్దకు వెళ్ళి "ఏం, వజ్రగుప్తా, మహరాజుగారు నీ వజ్రాన్ని చాలా చౌకగా కాజేసినట్టున్నారే! దానివల్ల ప్రాణగండం ఉన్నదని నువు భయపెట్టినా ఆయన భయపడలేదుట. అదీ ఒకందుకు మంచిదే అయింది. నువు నాకు ఒక చిన్న సహాయం చేసావంటే, ఆ వజ్రం నీకు తిరిగి లభిస్తుంది. దానికని నువు పుచ్చుకున్న పాతిక లక్షలూ తిరిగి ఇవ్వనవసరం కూడా ఉండదు. నేను చెప్పినట్టు చేస్తావా?" అన్నాడు.

"ఏమిటి తమ ఆజ్ఞ?" అన్నాడు వజ్రగుప్తుడు అనుమానంగా.


Image Hosted by ImageShack.us
"ఈ రాజు ఇంతలో చావడు. నేనిప్పట్లో సింహాసం ఎక్కే మార్గం లేదు. ఏ ఉపాయం చేతనైనా మనం ఆయనను చంపగలిగితే అనుమానం ఇప్పుడు వజ్రం మీదకి పోతుంది. అది కొంటే రాజుకు ప్రాణాపాయం కలగవచ్చునని నువు చెప్పనే చెప్పావు గద. వజ్రపు పొడి ప్రాణాలు తీస్తుందని విన్నాను. మామూలు విషాలలాగా దానికి రుచీ వాసనా ఉండదు.వజ్రపుపొడి ఉంటే ఇవ్వు. పాలలో కలిపి రాజుగారికిస్తాను" అన్నాడు యువరాజు.

వజ్రగుప్తుడు కొంచెం ఆలోచించి, "నా దగ్గర వజ్రపుపొడి ఉన్నది. కాని దాన్ని రాజుగారికి తమరే స్వయంగా పాలలో ఇవ్వాలి. ఈ పని మరొకరికి పెట్టకండి" అన్నాడు.

అందుకు ప్రసేనుడు ఒప్పుకొని, వజ్రగుప్తుడి దగ్గర వజ్రపుపొడి పొట్లం తీసుకొని వెళ్ళిపోయాడు.

ఇది జరిగిన వెంటనే వజ్రగుప్తుడు రహస్యంగా మహారాజును కలుసుకొని "మహారాజా, తమరు చాలా హెచ్చరికగా ఉండాలి. తమపై విషప్రయోగం చెయ్యాలని తమ శత్రువులు యత్నిస్తున్నారు. ముందుగా వైద్యుల చేత పరీక్షింపకుండా తమరు ఏదీ తాగవద్దని నా విన్నపం" అని సలహా ఇచ్చాడు.

ఇది తన మేలుకోరి ఇచ్చిన సలహాయే కాబట్టి రాజు తాను తినే ఆహారాన్నీ, తాగే పానీయాలను తన ఆంతరంగ వైద్యుడి చేత ముందుగా పరీక్షింపచేయడం ప్రారంభించాడు.

ఒకరోజు రాత్రి రాజుగారు పడుకోబోయే ముందు ఆయన తాగే పాలను ప్రసేనుడే తెచ్చి ఇచ్చాడు.

Image Hosted by ImageShack.us
"పాలు నువ్వే తీసుకొచ్చావా నాయనా? పనివాడేమయ్యాడు?" అంటూ రాజు పాలలోటా అందుకొని నోటికెత్తుకున్నాడు. కాని అంతలోనే ఆయనకు వజ్రగుప్తుడి హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఆయన పాలలోటా తీసుకొని తన రహస్య మందిరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ వైద్యుడా పాలను పరీక్షించి అందులో వజ్రపుపొడి కలిసినట్టు కనుక్కున్నాడు.

మర్నాడే రాజు తన యువరాజును రాజద్రోహిగా విచారణ చేసి, యావజ్జీవ కారాగార శిక్ష విధించి, తన ప్రాణాలను కాపాడిన వజ్రగుప్తుడికి అంతులేని కానుకలిచ్చాడు.

భేతాళుడీ కథ చెప్పి "రాజా, వజ్రగుప్తుడు ప్రసేనుడి యత్నాన్ని ఎందుకు పాడు చేసాడు? అందువల్ల తనకు నష్టమే తప్ప లాభం లేదే? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు.

దానికి విక్రమార్కుడు "వజ్రగుప్తుడు రాజద్రోహి కాదు. అతను యువరాజుకు వజ్రపుపొడి ఇచ్చిన మాట నిజమే. తాను వజ్రపుపొడిని నిరాకరించిన మాత్రాన యువరాజు రాజును హత్యచేయక మానడు. రాజు చస్తే అందరూ శిరీషకాన్నే నిందిస్తారు. దాన్ని గురించి తాను రాజుతో ఆడిన అబద్దం యువరాజును కాపాడుతుంది. అందుచేత, తనకు లాభం లేకపోయినా రాజు ప్రాణం కాపాడటం తన విధి అని వజ్రగుప్తుడు భావించి, రాజును హెచ్చరించాడు. ఇందువల్ల అతను తనను తాను రక్షించుకున్నవాడూ అయినాడు.ఎందుకంటే, రాజ్యంకోసం తండ్రిని చంపటానికి సిద్ధపడిన ప్రసేనుడు రాజయ్యాక తన రహస్యం తెలిసిన వజ్రగుప్తుణ్ణి బతికి ఉండనిస్తాడా? ఏ విధంగా చూసినా వజ్రగుప్తుడి ప్రవర్తన సమంజసంగానే ఉన్నది" అన్నాడు.

రాజుకీవిధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

Image Hosted by ImageShack.us


- ఏప్రిల్ 1969